పత్రికా ప్రకటన
లాక్ డౌన్ ను దశల వారిగా తొలగింపుకు ప్రధానిని కోరాము
పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి
విశాఖపట్నం, ఏప్రిల్ 8: ప్రజా శ్రేయస్సు దృష్ఠ్యా రాష్ట్రంలో లాక్ డౌన్ ను దశల వారిగా తొలగించాలని ప్రధానమంత్రిని కోరినట్లు పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరు కార్యాలయంలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు సభ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరన్స్ లో మా అభిప్రాయాలను అడిగారన్నరు. ఈ సందర్భంగా రాష్ట్రంలో హాట్ స్పాట్ లు, రద్దీ ప్రదేశాలను మినహాయించి మిగిలిన ప్రాంతాలలో దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేయాలని ముఖ్యమంత్రి, తమ పార్టీ అభిప్రాయంగా ప్రధానికి తెలియజేశామన్నారు. కరొనా వ్యాపించకుండా త్వరితగతిన చేపట్టిన చర్యల పట్ల ప్రధానికి కృతజ్ఞతలను తెలిపామన్నారు. రాష్ట్రంలో 400 కరోనా కేసులు నమోదు కాగా వాటిలో 280 కేసులు ఢిల్లీలోని మస్కట్ మసీదుకు వెళ్లి వచ్చిన వారివేనని, వారి బంధువుల శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపిచామని తెలిపారు. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ వంటి జన సమ్మర్ధం వుండే ప్రదేశాలను కాకుండా నిత్యావసర వస్తువుల దుకాణాలకు అనుమతి నివ్వాలన్నారు. విదేశాలలో చిక్కుకున్న వారిని పరీక్షలు నిర్వహించి తీసుకురావాలన్నారు. ప్రధాని చేపట్టిన స్వచ్ఛభారత్ పారిశుధ్య కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. రాష్ట్రానికి అవసరమైన 2 లక్షల టెస్ట్ కిట్స్, 2 లక్షల ఎన్-95 మాస్కులు, 2వేల వెంటిలేటర్స్ అందించాలని కోరామన్నారు. ప్రస్తుతం ఉన్న ల్యాబ్ లకు తోడుగా 4 వైరా ల్యాబ్స్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో నున్న 25 మంది లోక్ సభ, 11 మంది రాజ్య సభ్యులకు సంబంధించిన ఎంపీలాడ్స్ నిధులను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయాలని కోరామన్నారు. కరోనాకు ఇంతవరకు మందు లేనందున ప్రజలు పౌష్ఠికాహారం తీసుకోవడం, వ్యాయామం, యోగా, బ్రీతింగ్ థెరఫీ సాధన ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించు కోవాలన్నారు.