29.3.2020
అమరావతి
- ఎపిలో పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ.
- రేషన్ కార్డులపై మూడు విడతలుగా పంపిణీ చేయాలని సీఎం ఆదేశం.
- ఏప్రిల్ 15, 29వ తేదీల్లో కూడా ఉచిత పంపిణీ
- పేదలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సీఎం శ్రీ వైఎస్ జగన్ నిర్ణయం.
- కార్డులోని ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం చొప్పన పంపిణీ.
- తొలిరోజు 20,30,342 మంది కార్డుదారులకు రేషన్ అందచేత.
- 26,220.098 మెట్రిక్ టన్నుల బియ్యం..
- 1712.506 మెట్రిక్ టన్నుల కందిపప్పు పంపిణీ.
- ఉదయం 6 నుంచి ప్రారంభమైన పంపిణీ.
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా జరుగుతున్న లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆదివారం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రేషన్ కార్డులపై ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. కరోనా నియంత్రణ చర్యల వల్ల పనులు లేక పేదలు పస్తులు వుండే పరిస్థితి లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పేదలకు బియ్యం, కందిపప్పు అందచేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కార్డులోని ప్రతి ఒక్క వ్యక్తికి అయిదు కిలోల చొప్పున, అలాగే ప్రతి కార్డుకు ఒక కిలో కందిపప్పును రేషన్ దుకాణాల్లో పంపిణీ చేశారు. మొత్తం మూడు విడతలుగా ఈ పంపిణీ కార్యక్రమం జరగాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తొలివిడత పంపిణీ ఆదివారం నుంచి ప్రారంభించారు. రెండో విడత కింద ఏప్రిల్ 15వ తేదీన, మూడో విడత పంపిణీ ఏప్రిల్ 29వ తేదీన ప్రారంభించనున్నారు. పేదల ఆకలి బాధలు లేకుండా మానవత్వంతో ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నెల రోజుల్లో రేషన్ కార్డులో పేరు వున్న ప్రతివ్యక్తికి మొత్తం 15 కేజీల బియ్యం ఉచితంగా అందనుంది. అలాగే ప్రతికార్డుకు మూడు కిలోల కందిపప్పును కూడా పంపిణీచేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలిరోజున 20,30,342 కార్డులకు బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. కార్డుదారులకు కేటాయించిన రేషన్ దుకాణాల్లో 17,12,506, పోర్టబిలిటీ ద్వారా 3,17,836 మంది కార్డుదారులు లబ్ధిపొందినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ శ్రీ కోన శశిధర్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29,620 రేషన్ దుకాణాల ద్వారా ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 1,47,24,017 రేషన్ కార్డులు వున్నాయి. తొలిరోజున 26,220.098 మెట్రిక్ టన్నుల బియ్యం, 1712.506 మెట్రిక్ టన్నుల కందిపప్పును లబ్దిదారులకు అందచేశారు. రేషన్ కార్డు దారులు ఒకేసారి రేషన్ దుకాణాల వద్ద గుంపులుగా రాకుండా ప్రతిరోజూ ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రేషన్ ను అందచేస్తామని, విడతల వారీగా దుకాణాల వద్దకు రావాలంటూ అధికారులు ముందుగానే ప్రచారం చేశారు. కరోనా నియంత్రణలో భాగంగా రేషన్ దుకాణం వద్దకు వచ్చే వారు కనీసం మీటరు దూరం పాటిస్తూ వరుసలో వేచివుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. విఆర్వో, సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ తో లబ్దిదారులకు సరుకులను పంపిణీ చేశారు. అలాగే రేషన్ దుకాణాల వద్ద సబ్బు, శానిటైజర్ లను అందుబాటులో వుంచారు. కేంద్రప్రభుత్వం అదనంగా ఉచిత రేషన్ ఇస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అది ఆహార భద్రతా పథకం కింద మాత్రమే కొన్ని కుటుంబాలకే వర్తిస్తోంది. దీనిని పరిగణలోకి తీసుకుని అందరు రేషన్ కార్డుదారులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత రేషన్, కేజీ కందిపప్పును అందించేందుకు చర్యలు చేపట్టింది. దీనికోసం అదనంగా పడే భారాన్ని కూడా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది.
-------------------------------------------------------------------------------------------------------------------
జిల్లా చౌకదుకాణాలు మొత్తం కార్డులు నేరుగా తీసుకున్నవారు పోర్టబిలిటీ బియ్యం(MT) - కందిపప్పు(MT)
-------------------------------------------------------------------------------------------------------------------
పశ్చిమగోదావరి 2,211 12,59,925 2,05,042 50,774 3082.216 205.042
చిత్తూరు 2,901 11,33,535 1,80,414 12,315 2970.682 180.414
నెల్లూరు 1,895 9,04,220 1,22,509 16,638 1891.235 122.509
తూర్పు గోదావరి 2,622 16,50,254 2,11,499 44,402 3132.283 211.499
కృష్ణా 2,330 12,92,937 1,60,942 44,306 2341.030 160.942
ప్రకాశం 2,151 9,91,822 1,17,112 19,476 1765.180 117.112
గుంటూరు 2,802 14,89,439 1,72,190 49,492 2486.782 172.190
వైఎస్ఆర్ కడప 1,737 8,02,039 86,282 13,809 1373.685 86.282
విజయనగరం 1,404 7,10,528 73,880 4,855 1174.240 73.880
విశాఖపట్నం 2,179 12,4,5266 1,25,942 33,330 1834.230 125.942
శ్రీకాకుళం 2,013 8,29,024 76,012 0 1215.360 76.012
కర్నూలు 2,363 11,91,344 1,09,787 20,174 1759.298 109.787
అనంతపురం 3,012 12,23,684 70,895 8,265 1193.877 70.895
--------------------------------------------------------------------------------------------------------------------------------------------